భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో రోజు రెండో సెషన్లో నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికాను విరాట్ కోహ్లీ తన మ్యాజిక్తో దెబ్బ తీసాడు. 93 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన డీన్ ఎల్గర్, టోని డీ జోర్జీ జోడీని జస్ప్రీత్ బుమ్రా విడదీసాడు.
టోనీ డీ జోర్జీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్(2)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే ఈ ఇద్దరూ సౌతాఫ్రికా బ్యాటర్లు ఔటవ్వకుముందు కోహ్లీ.. ఏదో మంత్రం వేసాడు. టోని డీ జోర్జీ ఔటయ్యే రెండు బాల్స్ ముందు కోహ్లీ వికెట్ బెయిల్స్ మార్చాడు. దాంతో లక్ ఒక్కసారిగా టీమిండియా వైపు మళ్లింది.
ప్రస్తుతం కోహ్లీ చేసిన ఈ చిలిపి పని నెట్టింట వైరల్గా మారింది. కోహ్లీ మ్యాజిక్.. బుమ్రా ఫైర్ బౌలింగ్కు సఫారీ దిమ్మతిరిగిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్లోనూ ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇలానే ఓ మ్యాచ్లో స్టంప్స్ను మార్చి ఫలితాన్ని రాబట్టాడని, ఆ మంత్రాన్నే కోహ్లీ ఉపయోగించాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
బుమ్రా ధాటికి సౌతాఫ్రికా 113 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో డీన్ ఎల్గర్(80 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హమ్(6 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత 245 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజతో 9వ వికెట్కు 47 పరుగులు జోడించిన రాహుల్.. చివరి వికెట్గా వెనుదిరిగాడు. వేగంగా పరుగులు చేసిన రాహుల్.. సిక్సర్తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.