టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ చరిత్ర సృష్టించనున్నాడు. టీ20 క్రికెట్లో మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డ్ను సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న వరుణ్ చక్రవర్తీ.. ఆ జట్టుతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్లో దుమ్మురేపుతున్నాడు.
తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తీ రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తం రెండు మ్యాచ్ల్లో 5.25 ఎకానమీతో 8 వికెట్లు తీసాడు. బుధవారం రాత్రి జరిగే మూడో టీ20లో మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చరిత్రకెక్కుతాడు.

ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అధిగమిస్తాడు. 2016లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీసాడు. ఆ తర్వాత మరే స్పిన్నర్ కూడా ఈ రికార్డ్ను అధిగమించలేదు. ఆ అవకాశం వరుణ్ చక్రవర్తీకి దక్కింది. పేస్ అనుకూలంగా ఉండే సఫారీ పిచ్లపై వరుణ్ చక్రవర్తీ తన మిస్టరీ స్పిన్తో దుమ్మురేపుతున్నాడు.
రెండో టీ20లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా 124 పరుగులకే పరిమితమైనా..వరుణ్ చక్రవర్తీ ఐదు వికెట్లతో సత్తా చాటి విజయవకాశాలు సృష్టించాడు. రెండు టీ20ల్లో సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్స్ హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. సూపర్ ఫామ్లో ఉన్న ఈ మిస్టరీ స్పిన్నర్ పేస్కు అనుకూలంగా ఉండే సెంచరూరియన్ వికెట్పై ఎలా రాణిస్తాడో చూడాలి.
సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించి, ఆపై రెండో మ్యాచ్లో ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం రాత్రి 8.30 గంటలకు సెంచూరియన్ వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్పై పట్టు చిక్కుతుంది. ఓడితే మాత్రం సీరిస్ సాధించే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.