టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లు తీయడం ద్వారా వరుణ్ చక్రవర్తీ ఈ ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న ఈ నాలుగు టీ20ల సిరీస్లో వరుణ్ చక్రవర్తీ దుమ్మురేపుతున్నాడు.
తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తీ.. రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో ధారళంగా పరుగులిచ్చినా మూడు వికెట్లు తీసాడు. మొత్తం 10 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించాడు. 2016లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో అశ్విన్ 9 వికెట్లు తీసాడు. గత 8 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కుచెదరలేదు.

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో రవి బిష్ణోయ్ 9 వికెట్లు తీసినా అశ్విన్ను అధిగమించలేకపోయాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తీ, అశ్విన్ తర్వాత దీపక్ చాహర్(2019లో బంగ్లాదేశ్తో 8 వికెట్లు), అక్షర్ పటేల్(2022లో ఆస్ట్రేలియాతో 8 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సెన్(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 41) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు తలో వికెట్ దక్కింది.