పార్ల్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ వన్డే జరిగిన వేదికగానే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ముందుగా బ్యాటింగ్ చేయాలని భావించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందేనని, పిచ్ స్లోగా ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్నాడు.
గత మ్యాచ్లో మిడిలార్డర్లో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామని, అది తమకు గుణపాఠమని చెప్పుకొచ్చాడు. ఆ తప్పిదాలను సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శనకనబరుస్తామని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మ్యాచ్లో చేసిన తప్పిదాలను బ్యాటర్లు తెలుసుకున్నారని, సత్తా చాటేందుకు సిద్దమయ్యారన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసే వరకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని, రాహుల్ చెప్పినట్లు ఆరంభంలో కొంత ఇబ్బంది ఉన్నా ఆ తర్వాత బ్యాటింగ్ అనుకూలంగా మాుతుందని చెప్పాడు. గత మ్యాచ్లో 80-85 పర్సంటేజ్ రాణించమని, ఈ మ్యాచ్లో పూర్తి స్థాయిలో రాణించేందుకు కృషిచేస్తామన్నాడు. ఇక వర్క్లోడ్ నేపథ్యంలో మార్కో జాన్సన్ స్థానంలో సిసండా మగ్లాను తీసుకున్నామని తెలిపాడు. మగ్లా కూడా ప్రతిభ కలిగిన ఆటగాడేనని చెప్పుకొచ్చాడు.
గత ఏడాదిని భారీ టెస్టు విజయంతో ఘనంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఇంకా గెలుపు బోణీ చేయలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడటంతోపాటు తొలి వన్డేలో కూడా టీమిండియా చిత్తయింది. టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్లో నిలుస్తుంది. లేకుంటే ఘోరపరాభావం తప్పదు.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కీపర్), జన్నెమన్ మలాన్, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రాసీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, అండిలె పెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, సిసాండ మగల, లుంగి ఎంగిడి, టబ్రైజ్ షంసీ