సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సంచలన బ్యాటింగ్తో సఫారీ గడ్డపై 4 టీ20ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. పేలవ బ్యాటింగ్తో రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది.ఆదివారం ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ గేమ్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వరుణ్ చక్రవర్తీ(5/17) ఐదు వికెట్లతో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చగా.. అర్ష్దీప్ సింగ్ పేలవ బౌలింగ్తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39 నాటౌట్), అక్షర్ పటేల్(21 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ, అండిలే సిమెలెన్, ఎయిడెన్ మార్క్రమ్, పీటర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 7 వికెట్లకు పరుగులు చేసి గెలుపొందింది. ట్రిస్టన్ స్టబ్స్( 41 బంతుల్లో 7 ఫోర్లతో 47 నాటౌట్), హెండ్రీక్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/17) ఐదు వికెట్ల ఘనత సాధించగా.. రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన వరుణ్ చక్రవర్తీ
125 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(13) క్యాచ్ ఔటయ్యాడు. అనంతరం ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన ఎయిడెన్ మార్క్రమ్(3)ను వరుణ్ చక్రవర్తీ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా 2 వికెట్లకు 34 పరుగులు చేసింది. తన మరుసటి ఓవర్లో క్రీజులో సెట్ అయిన రీజా హెండ్రిక్స్(24) కూడా వరుణ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. జాన్సెన్తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ వరుణ్ చక్రవర్తీ మార్కో జాన్సెన్(7)ను క్లీన్ బౌల్డ్ చేసి 20 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసాడు. తన ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తీ వరుసగా డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్(2)తో పాటు డేవిడ్ మిల్లర్లను పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆండిలే సిమెలాన(7)ను రవి బిష్ణోయ్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
కొంపముంచిన అర్ష్దీప్ సింగ్..
సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 37 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్దీప్ సింగ్ వేసిన 17వ ఓవర్లో స్టబ్స్ 6, 4తో 12 పరుగులు చేయగా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కోయిట్జీ వరుస బౌండరీతో మరో 12 పరుగులు చేసి మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. 19వ ఓవర్లో అర్ష్దీప్ ఏకంగా 4 బౌండరీలు సమర్పించుకోవడంతో సఫారీ విజయం లాంఛనమైంది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. స్టబ్స్కు అర్ష్దీప్ సింగ్ ఇచ్చిన సిక్స్తో మూమెంటమ్ సఫారీ వైపు మళ్లింది.