టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికాపై సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ప్రమోషన్ పొంది ఫస్ట్ డౌన్లో బరిలోకి దిగిన తిలక్ వర్మ.. అభిషేక్ శర్మతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్తో 51 బంతుల్లో సెంచరీ సాధించాడు. మొత్తం 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 107 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు భారీ స్కోర్ అందించాడు.

ఈ శతకంతో తిలక్ వర్మ 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డ్ను అధిగమించాడు. 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో సురేశ్ రైనా సెంచరీ సాధించాడు. 23 ఏళ్ల 156 రోజుల వయసులో రైనా ఈ ఫీట్ సాధించాడు. అయితే తిలక్ వర్మ 22 ఏళ్ల 4 రోజుల వయసులోనే సౌతాఫ్రికాపై శతకం సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు.
ఈ జాబితాలో మార్టిన్ గప్టిల్(26 ఏళ్ల 84 రోజులు), బాబర్ ఆజామ్(26 ఏళ్ల 181 రోజులు), క్రిస్ గేల్(27 ఏళ్ల 355 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అంతర్జాతీయ టీ20ల్లో శతకం సాధించిన రెండో అతిపిన్న భారత బ్యాటర్గా కూడా తిలక్ వర్మ రికార్డ్ అందుకున్నాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయసులో శతకం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఏషియన్ గేమ్స్ 2023లో నేపాల్పై యశస్వి శతకం సాధించాడు. ఈ జాబితాలో ఈ ఇద్దరి తర్వాత శుభ్మన్ గిల్(23 ఏళ్ల 146 రోజులు), సురేశ్ రైనా(23 ఏళ్ల 156 రోజులు), అభిషేక్ శర్మ(23 ఏళ్ల 307 రోజులు)లు ఉన్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.