
నేపియర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో హ్యాట్రిక్ల పరంపర కొనసాగుతోంది. రెండో టీ20లో టీమ్ సౌథీ హ్యాట్రిక్ సాధిస్తే.. మూడో టీ20లో టీమిండియా హ్యాట్రిక్ వికెట్ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో బౌలర్కు హ్యాట్రిక్ చేజారినా.. మహమ్మద్ సిరాజ్ బుల్లెట్ త్రోతో టీమ్ ఖాతాలో చేరింది. అర్ష్దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్తో డారిల్ మిచెల్(10) వెనుదిరిగాడు. రెండో బంతిని అర్ష్దీప్ స్టన్నింగ్ యార్కర్ వేయగా.. ఇష్ సోదీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో అర్ష్దీప్ హ్యాట్రిక్ వికెట్ తీస్తాడని అంతా అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన సౌథీ బంతిని అద్భుతంగా డిఫెండ్ చేసి అర్ష్దీప్ హ్యాట్రిక్ వికెట్ను అడ్డుకున్నాడు. కానీ పరుగు కోసం క్రీజు ధాటిన నాన్స్ట్రైకర్ ఆడమ్ మిల్నే(0)ను మహమ్మద్ సిరాజ్ బుల్లెట్ త్రోతో రనౌట్ చేశాడు.
బ్యాక్వార్డ్ పాయింట్ నుంచి సిరాజ్ విసిరిన బంతి నేరుగా నాన్స్ట్రైకర్ వికెట్లను తాకింది. దాంతో మిల్నే పెవిలియన్ చేరగా.. టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. ఇక న్యూజిలాండ్ 6 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. 146/3తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. సిరాజ్, అర్ష్దీప్ అదరగొట్టడంతో సాధారణ స్కోర్కే పరిమితమైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డేవాన్ కాన్వే(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. మూడో వికెట్కు ఈ జోడీ 86 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో కివీస్ 190 ప్లస్ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ సిరాజ్ సూపర్ బౌలింగ్తో ఈ జోడీని విడదీసి కివీస్ పతనాన్ని శాసించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా... హర్షల్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. సిరాజ్(4/17), అర్ష్దీప్ సింగ్(4/37)లు టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు.