టాస్ గెలిచి బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ముఖ్యంగా తనతో పాటు శుభ్మన్ గిల్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తన వల్లే ఈ పరాజయం ఎదురైందని చెప్పుకొచ్చాడు.
పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని, ప్లాన్ బీని అమలు చేయలేకపోయామని తెలిపాడు. 'టాస్ గెలిచిన మేం ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ బౌలింగ్ ఎంచుకున్నాం. అయినప్పటికీ మేం బాగానే పుంజుకున్నాం. కానీ ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంగ్త్ల్లో బౌలింగ్ చేయాలనే విషయం సౌతాఫ్రికా బౌలర్లకు బాగా అర్థమైంది. ఇది నేర్చుకునే ప్రక్రియ. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం.

కొద్దిగా మంచు కూడా ఉంది. మా మొదటి ప్లాన్ విఫలమైంది. కానీ మేం సెకండ్ ప్లాన్ను అమలు చేయలేకపోయాం. అయినా పర్వాలేదు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. సౌతాఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేం పాఠం నేర్చుకున్నాం. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, నేను కాస్త మెరుగైన ఆరంభం ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎప్పుడూ అభిషేక్ శర్మపైనే ఆధారపడటం సరికాదు. అతనికి ఒక రోజు ఆఫ్ డే ఉంటుంది. నేను, శుభ్మన్, ఇతర కొందరు బ్యాటర్లు ఆ బాధ్యత తీసుకోవాలి.
కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. శుభ్మన్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. కనీసం నేను అయినా బాధ్యతగా ఆడాల్సిది. ఈ తప్పిదాలను సరిచేసుకొని తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. గత మ్యాచ్ తరహాలోనే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రాణిస్తారని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.