తాను సూపర్ ఫామ్లో ఉన్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నానని చెప్పాడు. పరుగులు చేయని మాట వాస్తవమని, కానీ తాను ఫామ్ కోల్పోలేదని స్పష్టం చేశాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
అయితే ఈ మ్యాచ్లోనూ సూర్యకుమార్ యాదవ్(12) తీవ్రంగా నిరాశపర్చాడు. గత 21 టీ20ల్లో సూర్య ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వరుసగా 21 (17), 4 (9), 1 (4), 0 (3), 12 (7), 14 (7), 0 (4), 2 (3), 7* (2), 47* (37), 0 (3), 5 (11), 12 (13), 1 (5), 39* (24), 1 (4), 24 (11), 20 (10), 12 (11), 5 (4), 12 (11)లతో మొత్తం 239 పరుగులే చేశాడు. సగటు 13.27 కాగా.. స్ట్రైక్రేట్ 118.90 మాత్రమే. టీమిండియా విజయాలు సాధిస్తున్నా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. టీ20 ప్రపంచకప్ ముందు అతని పేలవ ఫామ్ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

సౌతాఫ్రికాతో మూడో టీ20 అనంతరం తన బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సూర్య.. పరుగులు చేసేందుకు తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. తన నుంచి పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయని తెలిపాడు. 'నేను నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు చేసేందుకు నా నియంత్రణలో ఉన్న ప్రతీదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను. పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడే కచ్చితంగా వస్తాయి. నేను కూడా నా బ్యాట్ నుంచి పరుగుల కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఫామ్ కోల్పోలేదు. కానీ పరుగులు చేయడం లేదు.'అని సూర్య చెప్పుకొచ్చాడు.
మూడో టీ20లో విజయంపై స్పందిస్తూ.. బేసిక్స్ కట్టుబడి రాణించడంతో ఈ గెలుపు సాధ్యమైందని సూర్య తెలిపాడు. 'ఈ ఆట మనకు చాలా విషయాలను నేర్పుతుంది. గత మ్యాచ్ ఓటమి తర్వాత ఎలా పుంజుకుంటామనేది కీలకం. బేసిక్స్ కట్టుబడి విజయం సాధించాం. కటక్లో చేసిన పనులనే మళ్లీ చేయడానికి ప్రయత్నించాం. ఫలితం కూడా మాకు అనుకూలంగా వచ్చింది.
చండీగఢ్ పరాజయం నుంచి చాలా నేర్చుకున్నాం. ఆ మ్యాచ్ అనంతరం మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ప్రాక్టీస్ సెషన్స్కు వచ్చి తప్పిదాలను సవరించుకున్నాం. కటక్లో చేసిన పనులనే మళ్లీ పునరావృతం చేసేందుకు ప్రయత్నించాం. మేం మా బేసిక్స్కు కట్టుబడి ఆడాం. విభిన్నమైన పనులు చేయడానికి ప్రయత్నించలేదు. బేసిక్స్ కట్టుబడి ఆడటమే ముఖ్యమని భావించాం. ఈ విజయాన్ని ఆస్వాదిస్తాం. రేపు లక్నోకు చేరుకున్న తర్వాత తదుపరి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటాం.'అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.