
లూస్ షాట్..
ఇక ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ కొద్దిసేపు ఓపికగా ఆడాల్సిందన్నాడు. లూస్ షాట్ ఆడకుండా అసలు ఆ బంతినే వదిలేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'కోహ్లీ.. ఆఫ్ స్టంప్కు దూరంగా వేసిన బంతిని వెంటాడి మరీ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కూడా ఇలానే వికెట్ ఇచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ ఆడింది లూస్ షాట్. లంచ్ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.

ఆ బంతిని వదిలేయాల్సింది..
సాధారణంగా ఏ బ్యాట్స్మన్ అయిన క్రీజులో సెట్ అయ్యేందుకు కొంత సమయం తీసుకుంటారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో ప్రతీ బ్యాట్స్మన్ ఈ రూల్ పాటిస్తాడు. అయితే వేగంగా ఆడి త్వరగా డిక్లరేషన్ ఇవ్వాలనే వ్యూహంలో భాగంగా విరాట్ ఇలా నిర్లక్ష్యపు షాట్ ఆడినట్లున్నాడు. అయితే డిక్లేరేషన్ చేయాలనుకున్నప్పుడల్లా భారత్ ఆలౌటవుతుంది. చాలా సార్లు ఇలానే అయ్యింది. వాస్తవానికి ఆ బంతిని కోహ్లీ వదిలేయాల్సింది. పైగా అలాంటి బాల్స్ ఆడటంలో అతను తడబడుతుంటాడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది సెంచరీ లేదు..
ఇక విరాట్ కోహ్లీ తాజా వైఫల్యంతో ఈ ఏడాది కూడా అతని ఖాతాలో సెంచరీ చేరలేదు. మూడు ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ బాదలేదు. టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది 10 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. మొత్తం 11 మ్యాచ్ల్లో 28.21 సగటుతో 536 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ఏడాది మూడు వన్డేలు మాత్రమే ఆడిన కోహ్లీ 43 సగటుతో 129 రన్స్ చేశాడు. 8 టీ20ల్లో 37.7 సగటుతో 299 రన్స్ చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో కోల్కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్లో చివరిసారిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆపై ఇప్పటివరకూ మరో శతకం సాధించలేదు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 2020, 2021లో ఒక్క శతకం బాదలేదు.

విజయం దిశగా భారత్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. 16/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 130 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆథిత్య జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారత ఇన్నింగ్స్లో రిషభ్ పంత్(34 బంతుల్లో 6 ఫోర్లతో 34), అజింక్యా రహానే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 4 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడే క్రమంలో భారత బ్యాట్స్మన్ వికెట్లు ఇచ్చుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/42), మార్కో జాన్సెన్(4/55) నాలుగేసి వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.
305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్(31 బ్యాటింగ్), డసన్ (9 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(1)ను షమీ క్లీన్ బౌల్డ్ చేయగా... పీటర్సన్(17)ను సిరాజ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.


Click it and Unblock the Notifications
