టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ క్రికెటర్, బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ ప్రశంసల జల్లు కురిపించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలా వరుణ్ చక్రవర్తీ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడుతుందా? లేక పేసర్లతో బరిలోకి దిగుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ను ఆడించాలంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలో ఎవర్ని ఆడిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన శ్రీధరన్ శ్రీరామ్.. కుల్దీప్ యాదవ్ కంటే వరుణ్ చక్రవర్తీ మెరుగైన బౌలర్ అని అభిప్రాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తీ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడని చెప్పాడు.

'వరుణ్ చక్రవర్తీ అద్భుతమైన బౌలర్. నిరంతరం తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూనే ఉంటాడు. గతంలో కంటే ఇప్పుడు అతను కఠినమైన ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పవర్ ప్లేలో కూడా వరుణ్ చక్రవర్తిని ఉపయోగిస్తున్నాడు. అతను 17, 18వ ఓవర్లలో కూడా బౌలింగ్ చేయగలడు. వికెట్ అవసరమైనప్పుడల్లా సూర్య.. వరుణ్కే బంతిని అందిస్తాడు. భారత జట్టుపై జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపినట్లుగానే.. వరుణ్ చక్రవర్తి టీ20 మ్యాచ్ల్లో ప్రభావం చూపుతున్నాడు.
భారత జట్టు బౌలింగ్కు వరుణ్ చక్రవర్తి కీలకం. భారత పిచ్లపై అతను మరింత ప్రమాదకరంగా మారుతాడు. వరుణ్ చాలా ఆలస్యంగా క్రికెట్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అతను ఒక విషయాన్ని గ్రహించాడు. ఇతరుల కంటే భిన్నంగా ఉంటేనే గుర్తింపు లభిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. దాంతోనే అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.
బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్లు. కానీ దురదృష్టవశాత్తు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కలిసి ఆడలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరూ అద్భుతమైన బౌలర్లే. కానీ జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఆడించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్కు బదులుగా వరుణ్ చక్రవర్తీని ఆడించామని చెబుతా. ఎందుకంటే వరుణ్ చక్రవర్తీ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. కుల్దీప్ ఇంకా ఆ సామర్థ్యాన్ని పొందలేదు.'అని శ్రీధరన్ శ్రీరామ్ అభిప్రాయపడ్డాడు.