భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 163 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా(4/69) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) శతకాన్ని అందుకోలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.

256/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా..ఎల్గర్, మార్కో జాన్సెన్ సాధికారిక బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో ఎల్గర్ 228 బంతుల్లో 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. అనంతరం టీమిండియా కొత్త బంతి అందుకోగా.. మార్కో జాన్సెన్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
111 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్-మార్కో జోడీని లార్డ్ శార్దూల్ విడదీసాడు. డబుల్ సెంచరీకి చేరువైన ఎల్గర్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే గెరాల్డ్ కోయిట్జీని అశ్విన్ ఔట్ చేయగా.. సౌతాఫ్రికా 392/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో బుమ్రా నిప్పులు చెరగడంతో కగిసో రబడా(1), నండ్రే బర్గర్ క్లీన్ బౌల్డ్(0) అయ్యారు. స్టన్నింగ్ డెలివరీలతో బుమ్రా ఈ ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టెంబా బవుమా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండటంతో బ్యాటింగ్ రాలేదు. దాంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 408 పరుగులకు ముగిసింది.
ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.