
తిరువనంతపురం: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. ఆసియాకప్ 2022 అనంతరం బ్రేక్ తీసుకొని బరిలోకి దిగిన యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ అదరగొట్టారు. అద్భుత బౌలింగ్తో ఓకే ఓవర్లో మూడు వికెట్లు తీసి... సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. అతనికి తోడుగా దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయడంతో 9 పరుగులకే సౌతాఫ్రికా కీలక 5 వికెట్లు కోల్పోయింది. ఈ ఇద్దరి ధాటికి నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్.. టీ20ల్లో సౌతాఫ్రికా ఈ ఘనతను అందుకున్న ఏకైక భారత ప్లేయర్గా నిలిచాడు. మరోవైపు టీ20ల్లో సౌతాఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసింది. అతి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన అప్రతిష్టను మూటగట్టుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్లోనే దీపక్ చాహర్.. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్.. రెండో బంతికే క్వింటన్ డికాక్(1) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మార్క్రమ్ బౌండరీ బాదినా.... చివరి రెండు బంతుల్లో రస్సౌ(0), డేవిడ్ మిల్లర్(0)లను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్ వేసిన దీపక్ చాహర్.. యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్(0)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 9 పరుగులకే సఫారీ టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెట్ అయిన మార్క్రమ్(25)ను హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో సౌతాఫ్రికా 46 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఆసియాకప్లో క్యాచ్ వదిలేసాడని అతనిపై జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేసిన అభిమానులు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అర్ష్దీప్ సింగ్కు ఇచ్చిన బ్రేక్ బాగా పనిచేసిందని, అసాధారణమైన బౌలింగ్ చేశాడని కొనియాడుతున్నారు. ప్రస్తుత భారత బౌలర్లు తీసిన వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.