సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఆతిథ్య సౌతాఫ్రికా జట్టును తొలి సెషన్లో 55 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.. రెండో సెషన్లో ధనాధన్ బ్యాటింగ్తో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39) ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా స్కోర్ను అధిగమించింది.
రోహిత్ శర్మ ఔటయ్యే సమయానికి టీమిండియా 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.

అయితే సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షాడో కెప్టెన్గా వ్యవహరించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నా.. అన్నీ తానై చూసుకున్నాడు. బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్తో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు ఔటయ్యేలా ప్లాన్ రచించడంలోనూ కోహ్లీనే కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా సౌతాఫ్రికా లోయరార్డర్ బ్యాటర్ మార్కో జాన్సెన్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ రచించిన ప్లాన్ ప్రస్తుతం వైరల్గా మారింది. స్లిప్లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. బంతి వేసే ముందు సిరాజ్కు సైగలతో సలహా ఇచ్చాడు. ఇన్స్వింగర్ వేయాలని.. బ్యాటర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు క్యాచ్ వస్తుందని సైగలతో సూచించాడు.
కోహ్లీ చెప్పినట్లుగానే సిరాజ్ స్వింగర్ వేయగా.. మార్కో జాన్సెన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అద్భుతంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది. ఈ బంతికి మార్కో జాన్సెన్ నోరెళ్ల బెట్టి నిరాశగా పెవిలియన్ చేరగా.. సిరాజ్, కోహ్లీ సంబరాలు చేసుకున్నారు.
అయితే రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ సూచనలు అందిస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మకు టెస్ట్ కెప్టెన్సీ ఎలా చేయాలో విరాట్ కోహ్లీ నేర్పిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని, అతని హయాంలోనే టీమిండియా సంచలన విజయాలు అందుకుందని గుర్తు చేస్తున్నారు.
మైదానంలో దూకుడైన నిర్ణయాలు తీసుకోవడం.. ఆటగాళ్లు ఏ మాత్రం నిరాశ పడకుండా ఉత్తేశ పర్చడం వంటివి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో స్పెషల్గా కనిపించేవని కామెంట్ చేస్తున్నారు.