టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళా వన్డే క్రికెట్లో వరుసగా సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా బ్యాటర్గా రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా భారత్ తరఫున మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గాను గుర్తింపు పొందింది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో శతకం సాధించడం ద్వారా స్మృతి మంధానా ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధానా(120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్లతో 136) విధ్వంసకర శతకంతో చెలరేగింది. ఇదే సిరీస్లో బెంగళూరు వేదికగానే జరిగిన తొలి వన్డేలోనూ స్మృతి మంధానా(117) సెంచరీ నమోదు చేసింది. అదే జోరును తాజా మ్యాచ్లోనూ కొనసాగించింది.

ఇది స్మృతి మంధానాకు ఏడో వన్డే సెంచరీ కాగా.. భారత్ తరఫున అత్యధిక వన్డే శతకాలు నమోదు చేసిన మాజీ వుమెన్స్ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి మంధాన సమం చేసింది. అయితే మిథాలీ రాజ్ కంటే 127 ఇన్నింగ్స్లు స్మృతి మంధానా తక్కువగా ఆడింది.
మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ల్లో 7 శతకాలు నమోదు చేయగా.. స్మృతి మంధా 84 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(113 ఇన్నింగ్స్ల్లో 5 శతకాలు), పూనమ్ రౌత్(73 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు), తిరుష్ కామిని(37 ఇన్నింగ్స్ల్లో 2 శతకాలు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ మ్యాచ్లో 136 పరుగులు చేసిన స్మృతి మంధానా వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ రికార్డును అధిగమించింది. 2017లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్లో స్మృతి మంధానా 135 పరుగులు చేసింది. తాజా మ్యాచ్ల్లో 136 పరుగులతో తన రికార్డును మెరుగుపరుచుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగులు చేసింది. స్మృతి మంధానకు తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 103 నాటౌట్) సెంచరీతో సత్తా చాటింది.