సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
బ్యాటింగ్లో స్మృతి మంధాన (127 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 117) శతక్కొట్టగా.. బౌలింగ్లో స్పిన్నర్లు ఆశా శోభనా(4/21), దీప్తి శర్మ(2/10) నిప్పులు చెరిగారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. స్మృతి మంధాన శతకానికి తోడుగా దీప్తి శర్మ(48 బంతుల్లో 3 ఫోర్లతో 37 నాటౌట్), పూజా వస్త్రాకర్(42 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును మంధాన తన సూపర్ బ్యాటింగ్తో ఆదుకుంది.

దీప్తి శర్మతో 6వ వికెట్కు 81 పరుగులు.. పూజా వస్త్రాకర్తో ఏడో వికెట్కు 58 పరుగులు జోడించి భారీ స్కోర్ అందించింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయాబోంగా ఖాక(3/47) మూడు వికెట్లు తీయగా.. మసబట క్లాస్(2/51) రెండు వికెట్లు పడగొట్టాడు. అన్నేరీ డెర్క్సెన్, నోంకులెకో మ్లబా, షాంగేస్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. సునే లూస్(33), మరిజన్నే కాప్(24), సినాలో జఫ్టా(27 నాటౌట్) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
కెప్టెన్ లారా వోల్వార్డ్(4), తజిమ్ బ్రిట్స్(18), అన్నెక్ బోచ్(5), అన్నేరి డెర్క్సన్(1), షాంగేస్(8) తీవ్రంగా నిరాశపరిచారు. భారత బౌలర్లలో ఆశా శోభనా, దీప్తి శర్మలతో పాటు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీసారు.