సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. వాషింగ్టన్ సుందర్(29) ఔటైన వెంటనే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శుభ్మన్ గిల్ మూడు బంతులకే పెవిలియన్ బాట పట్టాడు. తొలి రెండు బంతులను డాట్ చేసిన గిల్.. మూడో బంతిని స్లాగ్ స్వీప్ షాట్తో బ్యాక్వార్డ్ స్క్వేర్ దిశగా బౌండరీ బాదాడు. అయితే ఈ షాట్ ఆడిన అనంతరం అతను మెడ నొప్పితో బాధపడ్డాడు. ఫిజియోలు వచ్చి మాట్లాడగా.. బ్యాటింగ్ చేయలేనని చెప్పాడు. దాంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు.
అయితే శుభ్మన్ గిల్కు నిద్రలో మెడ పట్టేసినట్లు తెలుస్తుంది. అయినా జట్టు కోసం అతను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాకపోవడంతో రిటైర్డ్ హర్ట్గా బరిలోకి దిగాడు. మెడ నొప్పి కాస్త తగ్గిన తర్వాత శుభ్మన్ గిల్ మళ్లీ బ్యాటింగ్కు దిగే ఛాన్స్ ఉంది. శుభ్మన్ గిల్ వెనుదిరగడంతో రిషభ్ పంత్ బ్యాటింగ్కు వచ్చాడు.

తనదైన బ్యాటింగ్తో దూకుడుగా ఆడిన అతన్ని కార్బిన్ బోష్ తెలవైన బంతితో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 45 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత్ ఇంకా 21 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో జడేజా(11 బ్యాటింగ్)తో పాటు ధ్రువ్ జురెల్(5 బ్యాటింగ్) ఉన్నాడు.
37/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) ఆచితూచి ఆడారు. జిడ్డు బ్యాటింగ్తో సఫారీ బౌలర్లను విసిగించారు. కాసేపటికి గేర్ మార్చిన సుందర్.. ఓ సిక్స్, రెండు బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. కానీ అతన్ని సిమన్ హర్మర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో రెండో వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే గిల్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగ్గా.. ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ను కేశవ్ మహరాజ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడిన పంత్ను బోష్ షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన జురెల్ బౌండరీ బాది తొలి సెషన్ను ముగించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది.