IND vs SA: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సన్నదమవుతోంది. ఓ వైపు జూనియర్ టీమ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుండగా.. మరోవైపు సీనియర్ టీమ్ సుదీర్ఘ ఫార్మాట్ కోసం నెట్స్లో శ్రమిస్తోంది. వన్డే ప్రపంచకప్ పరాజయం అనంతరం విశ్రాంతి తీసుకున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లంతా.. ఈ సిరీస్తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు టీ20 సిరీస్ ఆడిన శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు. ఈ సన్నాహక క్యాంప్ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షిస్తున్నాడు.

సౌతాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఈ సారి అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గురువారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ బాదినట్లు సమాచారం. రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ తెలిపాడు.
ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఎంపికైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చివరి నిమిషంలో దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. ఫిట్నెస్ టెస్ట్లో పాసైతే షమీ.. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కుతాడని బీసీసీఐ ప్రకటించింది.
భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ.