సౌతాఫ్రికా గడ్డపై టీమిండియాకు మరో ఘోర పరాభావం ఎదురైంది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. దాంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనే ఆశలు మరోసారి అడియాశలయ్యాయి. టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమైతే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యూహాత్మక తప్పిదం మరో కారణం. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేని లోటు ఈ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మూడో పేసర్గా ప్రసిధ్ కృష్ణను తీసుకోవడం టీమిండియా కొంపముంచింది.

పిచ్పై బౌన్స్ లభిస్తుందని, బౌన్సర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలడని ముఖేష్ కుమార్ను కాదని ప్రసిధ్ కృష్ణకు అవకాశం ఇస్తే అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎత్తుగా ఉన్న ప్రసిధ్ బౌన్సర్లతో ఇబ్బంది పెడుతాడేమో అనుకుంటే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 20 ఓవర్లు వేసి 93 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.
ప్రసిధ్ కృష్ణ కర్ణాటకు పేసర్ కావడంతో ముఖేష్ కుమార్ను కాదని అతనికి రాహుల్ ద్రవిడ్ ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా భారత్-ఏ జట్టు తరఫున ఐదు వికెట్లు తీయడం కూడా అతని ఎంపికకు కారణమైంది. కానీ సూపర్ ఫామ్లో ఉన్న ముఖేష్ కుమార్ను కాదని ప్రసిధ్ కృష్ణను ఆడించడం ఘోర తప్పిదమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిమిత ఓవర్ల సిరీస్లో ముఖేష్ కుమార్ అదరగొట్టాడని, మహమ్మద్ షమీ శైలిలో అతను బౌలింగ్ చేస్తాడని గుర్తు చేస్తున్నారు. సీమ్తో రెండు వైపులా బౌలింగ్ చేయడంతో పాటు యార్కర్లు కూడా వేయడంలో అతను దిట్ట అని, కనీసం రెండో టెస్ట్లోనైనా ముఖేష్ కుమార్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ప్రసిధ్ కృష్ణతో పాటు నాలుగో పేసర్గా జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా తేలిపోయాడు. 5.31 ఎకానమీ రేటుతో 101 పరుగులు సమర్పించుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.
ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు కూడా తీసిన సిరాజ్.. పరుగులను కట్టడి చేయలేకపోయాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రా ఒంటరివాడు అయ్యాడు. మరో ఎండ్లో సహకారం లేకపోవడంతో అతను ఏం చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైనా.. బౌలర్లు విజృంభించి ఉంటే కాస్త పోరాడే అవకాశం దక్కేది.