జోహన్నెస్బర్గ్: గడ్డు పరిస్థితుల్లో టీమిండియాను మరోసారి లార్డ్ శార్దూల్ ఠాకూర్(3/8) ఆదుకున్నాడు. అవసరమైనప్పుడల్లా బంతిని అందుకొని వికెట్లు తీసే శార్దూల్ ఠాకూర్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. దాంతో రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 35/1 ఓవర్నైట్ స్కోర్ రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా లంచ్ బ్రేక్ సమయానికి 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులోటెంబా బవుమా(0 బ్యాటింగ్) ఉండగా..కైల్ వెరీన్ బ్యాటింగ్కు రానున్నాడు.
నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఓవర్ నైట్ బ్యాట్స్మన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62), డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28) నిలకడగా ఆడారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. పూర్తిగా డిఫెన్స్కు పరిమితమవుతూ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఓవైపు ఎల్గర్ నిదానంగా ఆడినా.. మరోవైపు పీటర్సన్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని లార్డ్ శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే పీటర్సన్ను ఔట్ చేసిన శార్దూల్.. లంచ్ బ్రేక్కు ముందు డస్సెన్(1) కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 12 పరుగుల వ్యవధిలోనే సఫారీ టీమ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా ఇంకా 100 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇక భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఇన్నింగ్స్ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు.