IND vs SA: మిడిలార్డర్ వైఫల్యం.. భారత్కు తప్పని పరాజయం! సౌతాఫ్రికాదే ఫస్ట్ వన్డే!

పార్ల్: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ చేజార్చుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభాన్ని అందుకోలేకపోయింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్తో 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు.
నాలుగో వికెట్కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. శిఖర్ ధావన్(84 బంతుల్లో 10 ఫోర్లతో 79), విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 3 ఫోర్లతో 51), శార్దూల్ ఠాకూర్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, షంసీ, పెహ్లుక్వాయో రెండేసి వికెట్లు తీయగా.. మహరాజ్, మార్క్రమ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.

రాహుల్ విఫలం..
297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(12) మార్క్రమ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ముందుకు నడపించాడు. తనదైన శైలిలో ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా ధావన్ అదే జోరు కనబర్చగా.. కోహ్లీ తనదైన శైలిలో క్విక్ సింగిల్స్, డబుల్స్తో అతనికి అండగా నిలిచాడు. మహరాజ్ బౌలింగ్లో శిఖర్ ధావన్ క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ధావన్, విరాట్ జోరు..
ఇక ఈ జోడీని వీడదీసేందుకు బవుమా స్పిన్నర్లను రంగంలోకి దించగా.. ధావన్, కోహ్లీ ఆచితూచి ఆడారు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ధావన్ సెంచరీ దిశగా దూసుకెళ్లగా.. కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ పరిస్థితుల్లో మహరాజ్.. సౌతాఫ్రికాకు బ్రేక్ త్రూ అందించాడు. సూపర్ డెలివరీతో శిఖర్ ధావన్ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ను టర్న్ చేశాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి పంత్ రాగా.. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జోరు మీద కనిపించాడు.

మాస్టర్ ప్లాన్..
కానీ బవుమా సూపర్ ప్లాన్తో భారత మాజీ కెప్టెన్కు కళ్లెం వేసాడు. షంసీ ఫర్ఫెక్ట్ ప్లాన్తో ఉచ్చు బిగించి పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్తో భారత్ వికెట్ల పతనం మొదలైంది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(17) ఎంగిడి బౌన్సర్తో బోల్తా కొట్టించగా.. రిషభ్ పంత్(16)ను వైడ్ బాల్తో పెహ్లుక్వాయో స్టంపౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ పూర్తిగా సౌతాఫ్రికా వైపు మళ్లింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(2) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంగిడి బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(7)ను పెహ్లుక్వాయో క్లీన్ బౌల్డ్ చేయగా.. భువనేశ్వర్(4)ను షంసీ పెవిలియన్ చేర్చాడు.

శార్దూల్ హాఫ్ సెంచరీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా(10)తో శార్దూల్ ఠాకూర్(25 నాటౌట్) వరుస బౌండరీలతో పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. బౌలింగ్లో విఫలమైన బ్యాటింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. భారత టాప్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డ బౌలర్లను శార్దూల్ ఆడుకున్నాడు. ఎంగిడి వేసిన 48వ ఓవర్లో 4,4,6తో 17 పరుగులు పిండుకున్నాడు. అయితే విజయానికి కావాల్సి పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత్కు ఓటమి దక్కలేదు. అయితే ఆఖరి ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి శార్దూల్ ఆఫ్ సెంచరీ చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications