సౌతాఫ్రికాతో నాలుగో టీ20లోనూ టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్(56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 109 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ నాలుగు టీ20ల సిరీస్ను సెంచరీతో ప్రారంభించిన సంజూ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. కానీ ఆఖరి మ్యాచ్లో మాత్రం తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
భారీ సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే సంజూ శాంసన్ కొట్టిన ఓ భారీ సిక్సర్తో గ్యాలరీలో ఉన్న ఓ అభిమానికి తీవ్రగాయమైంది. అతని సిక్సర్ ధాటికి ఓ లేడీ ఫ్యాన్ దవడ పగిలింది. ఆ నొప్పికి విలవిలలాడిన సదరు మహిళా.. ఐస్ ప్యాక్ పెట్టుకొని కన్నీటి పర్యంతమైంది.
ఈ దృశ్యాలు టీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సదరు అభిమానికి దెబ్బ తగిలిన విషయాన్ని గుర్తించిన సంజూ శాంసన్.. ఆమెకు సైగలతో క్షమాపణలు చెప్పాడు.

ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని స్టబ్స్.. లెగ్ స్టంప్ లైన్లో ఫ్లైటెడ్ డెలివరీ వేయగా సంజూ శాంసన్.. డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ తరలించాడు.
A SIX FROM SANJU SAMSON HIT ON THE FACE OF A FAN...!!!! pic.twitter.com/wZJR9ibIc7
— Johns. (@CricCrazyJohns) November 15, 2024
అయితే ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న సెక్యూరిటీ ఆఫిసర్ ఈ బంతిని అందుకునే ప్రయత్నం చేయగా.. అతని చేతిని తాకి లేచిన బంతి పక్కనే ఉన్న ఓ లేడీ ఫ్యాన్ దవడకు బలంగా తాకింది. ఆమె బంతిని చూడకుండా పక్కవారితో ఏదో మాట్లాడుతూ ఉండటంతో ఈ గాయమైంది. బంతి బలంగా తాకడంతో నొప్పిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైంది.
సంజూ శాంసన్కు తోడుగా తెలుగు తేజం తిలక్ వర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లతో 120 నాటౌట్) కూడా సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) దూకుడుగా ఆడాడు.
భారత బ్యాటర్ల ధాటికి సౌతాఫ్రికా బౌలర్లు పోటాపోటీగా పరుగులిచ్చుకున్నారు. లుతో సిపమ్లా ఒక్క వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. విదేశీ గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక టీ20 స్కోర్. సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండో వికెట్ అజేయంగా 210 పరుగులు జోడించారు. 80 బంతుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం.