
గౌహతి: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే గాయంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటింగ్ ఆల్రౌండర్ దీపక్ హుడా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం గాయపడ్డాడు. అయితే అతని గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆటను కొనసాగించిన రోహిత్.. కాస్త అసౌకర్యంగానే కనిపించాడు. దాంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఏమైందో ఏమో తెలియదు కానీ.. రెండో టీ20 మ్యాచ్కు ముందు రోహిత్ ప్రాక్టీస్ సెషన్లో పెద్దగా పాల్గొనలేదు. ఏమైనా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడా? అనే ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్ బరిలోకి దిగడంతో అతను ఫిట్గానే ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలో పార్నెల్ వేసిన రెండో ఓవర్లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. పార్నెల్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని రోహిత్ స్కూప్ షాట్తో బౌండరీకి తరలించాడు. అయితే ఈ షాట్ ఆడే క్రమంలో బంతి అతని గ్లౌవ్స్ తాకి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది. అయితే రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అతని ఎడమ మణికట్టుకు బంతి బలంగా తాకినట్లు అనిపించింది. మైదానంలోకి వచ్చిన ఫిజియో.. ప్రథమ చికిత్స చేయడంతో రోహిత్ తన ఆటను కొనసాగించాడు. అయితే రోహిత్కు ఏం కాకుడని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా అద్భుతమైన శుభారంభం అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43), కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) దంచికొట్టడంతో తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యం లభించింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విడదీసాడు. హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో రాహుల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మహరాజ్ అతన్ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.