టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సొంత అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో రోహిత్ శర్మ(5) దారుణంగా విఫలమయ్యాడు. పేలవ షాట్తో వికెట్ పారేసుకున్నాడు. సౌతాఫ్రికా వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన రోహిత్.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో చెత్త షాట్తో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
టెస్ట్ ఫార్మాట్లో కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయాలని మాజీ క్రికెటర్లు చేసిన సూచనలను రోహిత్ శర్మ ఏ మాత్రం పట్టించుకోలేదు. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా రచించిన షాట్ పిచ్ బాల్ ఉచ్చులో హిట్మ్యాన్ చిక్కుకున్నాడు. ఊరించే బౌన్సర్తో ఫైన్ లెగ్ ఫీల్డర్ సాయంతో రోహిత్ శర్మకు రబడా చెక్ పెట్టాడు.

రోహిత్ శర్మ వికెట్తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ ఔటైన వెంటనే బౌండరీలతో దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్(17), శుభ్మన్ గిల్(2) క్యాచ్ ఔట్లుగా వెనుదిరిగారు. దాంతో టీమిండియా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే కెప్టెన్గా బాధ్యతాయుతంగా ఆడాల్సిన రోహిత్ నిర్లక్ష్యపు షాట్తో వెనుదిరగడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేస్తూ ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. 'వడపావ్ పాచిపోతుందా? రోహిత్.. త్వరగా ఔటయ్యావ్?'అని ఒకరంటే.. ప్రపంచకప్ ఫైనల్లో ఇలానే చెత్త షాట్తో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ కారణమయ్యాడని మరొకరు విమర్శించారు. రోహిత్ శర్మ ఇంకా వన్డే ఫార్మాట్ నుంచి బయటకు రాలేదని, టెస్ట్ తరహా ఆటను ఆడలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు.
సుదీర్ఘ ఫార్మాట్లో.. ముఖ్యంగా పేస్కు అనుకూలించే పిచ్లో ఓపికగా బ్యాటింగ్ చేయాలనేది బ్యాటర్లకు ఉన్న ప్రాథమిక సూత్రం. అలాగే శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులను మాత్రమే ఆడాలని కూడా కోచ్లు సూచిస్తుంటారు. క్రీజులో ఎక్కువ సేపు ఉండే ప్రయత్నం చేయాలని కూడా చెబుతారు. కానీ రోహిత్ ఈ విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
14 బంతులు ఆడిన అతను ఓ బౌండరీ బాది 5 పరుగులు చేశాడు. అప్పటికే అతని ఓపిక నశించింది. ఈ విషయాన్ని గ్రహించిన రబడా.. టెంప్టింగ్ బౌన్సర్లతో రోహిత్ శర్మను రెచ్చగొట్టాడు. రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడేలా బౌలింగ్ చేసి ఫైన్ లెగ్ ఫీల్డర్ సాయంతో పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇచ్చిన క్యాచ్లను సౌతాఫ్రికా ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం కోహ్లీ, అయ్యర్ చేస్తున్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 3 వికెట్లకు 91 రన్స్ చేసింది.