టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. కేప్టౌన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్గా.. భారత సారథిగా చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఫలితంతో రోహిత్ శర్మ.. కెప్టెన్గా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

కేప్ వేదికగా భారత్కు ఇదే తొలి టెస్ట్ విజయం. గతంలో భారత్ ఇక్కడ విజయం సాధించలేదు. భారత జట్టే కాదు మరే ఆసియా టీమ్ కూడా కేప్టౌన్ గడ్డపై టెస్ట్ విజయాన్ని అందుకోలేదు. దాంతో కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు.

అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసిన రెండో భారత కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు.
సఫారీ గడ్డపై 2006లో తొలి విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు మాత్రమే గెలుపొందింది. కేప్టౌన్లో టెస్ట్ గెలిచిన తొలి ఆసియా టీమ్గా కూడా టీమిండియా చరిత్రకెక్కింది.
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా విజయాలు:
2006లో జోహన్నెస్బర్గ్ వేదికగా 123 పరుగులతో గెలుపు
2010లో డర్బన్ వేదికగా 87 పరుగులతో విజయం
2018లో జోహన్నెస్బర్గ్ వేదికగా 63 పరుగులతో గెలుపు
2021లో సెంచూరియన్ వేదికగా 113 పరుగులతో విజయం
2024లో కేప్టౌన్ వేదికగా 7 వికెట్లతో గెలుపు.
ఒకటిన్నర రోజు ముగిసిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.
ఎయిడెన్ మార్క్రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు. 79 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 12 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసి గెలుపొందింది.