
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తుంది. మరో మూడు వికెట్లు తీస్తే ఈ మ్యాచ్లో విజయం సాధించి మూడు టెస్ట్ల సిరీస్ ఆరంభంలో శుభారంభం చేస్తుంది. 94/4 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 66 ఓవర్లలో 7 వికెట్లకు 182 రన్స్ చేసింది. క్రీజులో టెంబా బవుమా (34 బ్యాటింగ్), మార్కో జాన్సెన్(5 బ్యాటింగ్) ఉన్నారు.
సౌతాఫ్రికా విజయానికి ఇంకా 123 పరుగులు కావాలి. ఇక ఐదో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ హుషారుగా కనిపించాడు. వికెట్ల వెనుకాల తనదైన మాటలతో బౌలర్లను ఉత్సాహపరిచాడు. కామెడీ చేస్తూ సహచర ఆటగాళ్లను నవ్వులు పూయించాడు. సీరియస్ మ్యాచ్ సాగుతుండగా.. తన పక్కనే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని.. 'భయ్యా.. ఈ రోజు లంచ్ మెనూ ఏంటిది? ఆకలి దంచేస్తుంది'?అని అడిగాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇక రిషభ్ పంత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. ఈ మాటలను విన్న అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇక సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆటగాళ్లకు సరైన ఆహారం అందడం లేదని తెలుస్తోంది. రెండో రోజుల క్రితం టీమిండియాకు సంబంధించిన లంచ్ మెనూ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఈ మెనూలో చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్, వెజిటబుల్ కడాయి, పనీర్ టిక్కా ఆహారపదార్థాలున్నాయి. ఇవన్నీ నాసిరకం ఫుడ్ అని, సరైన ప్రొటిన్స్ ఉన్న ఫుడ్ పెట్టడం లేదని నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఫన్నీ కామెంట్స్తో సెటైర్లు పేల్చారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ ఫుడ్ తినలేకనే సౌతాఫ్రికా టూర్ నుంచి తప్పుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక నాలుగో రోజు ఆట ప్రారంభంలో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(77) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సూపర్ బ్యాటింగ్తో బౌండరీలు బాదుతూ భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మరోవైపు టెంబా బవుమా కూడా జిడ్డుగా బ్యాటింగ్ చేయడంతో భారత బౌలర్లు చికాకుకు గురయ్యారు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు డీన్ ఎల్గర్ను ఔట్ చేయడంతో సౌతాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్(22) కూడా పోరాడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ సూపర్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వియాన్ ముల్డర్(1)ను షమీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మార్కో జాన్సెన్(5 బ్యాటింగ్)తో టెంబా బవుమా మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ భారత్ 327 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. దాంతో టీమిండియా 130 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో 174 రన్స్ మాత్రమే చేసిన కోహ్లీసేన.. ప్రత్యర్థి ముందు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.