IND vs SA: టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లను చెడుగుడు ఆడుతున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
9 ఫోర్లు, 2 సిక్స్లతో వీరవిహారం చేశాడు. అతను కొట్టిన రెండు సిక్స్ల్లో ఒకటి భారీ సిక్సర్ ఉండటం విశేషం. ఈ సిక్సర్ ధాటికి మీడియా బాక్స్ గ్లాస్ పగిలిపోయింది. ప్రస్తుతం ఈ సిక్స్కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎయిడెన్ మార్క్రమ్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ చివరి రెండు బంతులును రింకూ సింగ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతిని స్ట్రైట్గా ఆడాడు. అతని ధాటికి బంతి సైట్ స్క్రీన్పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్ను బలంగా తాకింది. ఆ బంతి ధాటికి గ్లాస్ పగిలిపోయింది.

ఈ సిక్సర్కు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ అభిమానులతో పంచుకోగా.. వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్తో పాటు సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
తిలక్ వర్మ ( 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29), రవీంద్ర జడేజా(14 బంతుల్లో ఫోర్, సిక్స్తో 19) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, విలియమ్స్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు. 59/3 స్కోర్ వద్ద క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్.. సూర్యతో కలిసి జట్టును ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు 70 పరుగులు జోడించాడు.