IND vs SA: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 181 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 56), రింకూ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29), రవీంద్ర జడేజా(14 బంతుల్లో ఫోర్, సిక్స్తో 19) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, విలియమ్స్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.

తిలక్ మెరుపులు..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యతో కలిసి తిలక్ వర్మ ధాటిగా ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.
ఇక బ్యాటింగ్కు వచ్చిన రింకూ సింగ్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
చెలరేగిన సూర్య..
వికెట్లు పడినా ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్ మార్క్షార్ట్స్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సూర్య 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాపై అతనికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా.. ఐదు ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.

రింకూ సింగ్ విధ్వంసం..
క్రీజులో ప్రమాదకరంగా మారిన సూర్యను టబ్రైజ్ షంసీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా రాగా.. రింకూ సింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా సైతం మెరుపులు మెరిపించడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ అందుకుంది. అయితే ఆఖరి ఓవర్లో జడేజా, అర్ష్దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటయ్యారు.
మరో 3 బంతుల్లో ఇన్నింగ్స్ ముగిస్తుందనగా వర్షం రావడంతో అంపైర్లు ఆటను ఆపేసారు. మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ఇప్పటికే ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ను వర్షం మింగేసింది.