
హైదరాబాద్: పరుగుల వర్షం కురిసిన మ్యాచ్లో టీమిండియా 16 పరుగులతో సౌతాఫ్రికాను ఓడించింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఓటమిపాలైనా సౌతాఫ్రికా తమ పోరాటంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.
అయితే అనూహ్యంగా 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేఎల్ రాహుల్ కూడా తనకి ఈ అవార్డు దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆశ్చర్యంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనే ఈ అవార్డుకి అర్హుడు. అతనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం.' అంటూ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.
అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికలో కామెంట్రీ ప్యానల్లో ఉన్న ఓ మాజీ ఓపెనర్.. రాహుల్కు అనుకూలంగా ఓటేసాడని, ఓపెనర్గా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని చెప్పాడని ప్రముఖ వ్యాఖ్యత హర్ష భోగ్లే రాహుల్తో అన్నాడు. సదరు కామెంటేటర్ ఎవరో చెప్పకపోయినా.. సునీల్ గవాస్కర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే కామెంట్రీ ప్యానల్లో ఉన్న ఓపెనర్లు సునీల్ గవాస్కర్, రాబిన్ ఊతప్ప, ఆకాశ్ చోప్రాలు మాత్రమే. సునీల్ గవాస్కర్ను కాదని ఊతప్ప, ఆకాశ్ చోప్రాలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరు. అయితే రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకు ఇవ్వకున్నా.. సెంచరీతో రాణించిన డేవిడ్ మిల్లర్కు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.