IND vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా 8వ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికాతో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 234 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ శతక్కొడితే.. బౌలింగ్లో జడేజా ఐదు వికెట్లతో తిప్పేసాడు. దాంతో సౌతాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవి చూసింది.
ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/33) ఐదు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ షమీ(2/18), కుల్దీప్ యాదవ్(2/7) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్(1/11) ఓ వికెట్ దక్కింది.
సఫారీ బ్యాటర్లలో మార్కో జాన్సెన్(14), వాన్ డెర్ డస్సెన్(13), టెంబా బవుమా(11), డేవిడ్ మిల్లర్(11) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ మెగా టోర్నీలో సెంచరీల మోత మోగించిన క్వింటన్ డికాక్(5) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. సఫారీ భీకర బ్యాటింగ్ లైనప్.. భారత బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది.
పాయింట్స్ టేబుల్లో టాప్-2 టీమ్స్ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత బౌలింగ్ను ఎదుర్కోలేక సఫారీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఓటమెరుగని జట్టుగా నిలిచిన భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరగా.. రెండు ఓటముల ఎదుర్కొన్న సౌతాఫ్రికా సైతం సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
రికార్డ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బర్త్డే బాయ్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో ఆడనుంది. నవంబర్ 12న దీపావళి రోజున ఈ మ్యాచ్ జరగనుంది.