సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్కు టీమిండియా సిద్దమైంది. మంగళవారం కటక్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. ఈ సిరీస్లో టీమిండియా బరిలోకి దిగే కాంబినేషన్పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026 కావాల్సిన కాంబినేషన్ను ఈ సిరీస్తో సెట్ చేసుకోవాలని సూచించాడు. ఈ సిరీస్లో భారత్ విజయం సాధించాలంటే ఐదుగురి ఆటగాళ్లను తప్పకుండా తుది జట్టులో ఆడించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
'శుభ్మన్ గిల్ రీఎంట్రీతో సంజూ శాంసన్ మూడో స్థానంలో ఆడుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది. ఫస్ట్ డౌన్లో సూర్య లేదా తిలక్ వర్మను ఆడించవచ్చు. సంజూను మూడో స్థానంలో ఆడించాలి. కానీ శుభ్మన్ గిల్ రాకతో అతనికి అవకాశాలు సన్నగిల్లాయి. గతంలో ఓపెనర్ కమ్ కీపర్గా రాణించి సత్తా చాటిన సంజూకు జట్టులో చోటు లేని పరిస్థితి నెలకొంది.

ఓపెనర్గా స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన గిల్ ఎంట్రీతో.. మిడిలార్డర్లో ఆడే వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ భారత జట్టుకు అవసరం ఉంది. ఈ సిరీస్ భారత బ్యాటర్ల పాత్రపై మేనేజ్మెంట్ స్పష్టతతో ఉంటుందని ఆశిస్తున్నా. భారత బ్యాటింగ్ లైనప్కు తగ్గట్లుగానే సౌతాఫ్రికా ఆడనుంది. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ గెలవగల సత్తా సౌతాఫ్రికాకు ఉందో లేదో ఈ సిరీస్తో తేలనుంది. అందుకే ఈ సిరీస్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సౌతాఫ్రికా జట్టులో ప్రమాదకరమైన ఆటగాళ్లు ఎవరూ లేరు. కుల్దీప్, వరుణ్, బుమ్రా వంటి బౌలర్లు ఆ జట్టులో కనిపించడం లేదు.
భారత్కు కూడా ఇది కీలకమైన సిరీస్. టీమ్కాంబినేషన్ను ఎంచుకోవాలి. ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. టీ20 జట్టులో స్థిరత్వం కీలకం. అర్ష్దీప్ సింగ్ను టీ20 జట్టులో కొనసాగిస్తారా? లేదా? అనేది కూడా తేల్చుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం అతన్ని జట్టులో ఆడించాలి. వరుణ్, కుల్దీప్ యాదవ్ ఇద్దర్నీ ఆడించగలమో లేదో చూసుకోవాలి. మంచు ప్రభావం ఉంటే మూడో పేసర్ను తీసుకోవాలి. లేదంటే బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఆడాలి. ఈ బౌలింగ్ దాడికి ప్రత్యర్థిని ఆలౌట్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ బౌలర్లతో ఎంత స్కోర్నైనా కాపాడుకోవచ్చు. తొలి మ్యాచ్లో ఈ బౌలింగ్ లైనప్ను చూడాలని అనుకుంటున్నా. టీ20 ప్రపంచకప్ ముందు వరుణ్ చక్రవర్తీ హిడెన్ టాలెంట్ను బయటపెట్టవద్దు. ప్రపంచకప్లోనే అతని అసలు అస్త్రాన్ని వాడాలి.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.