అసలేం జరిగిందంటే..?
సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 45వ ఓవర్లో డసెన్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ నాలుగో బంతి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. డస్సెన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ కీపర్ చేతిలో పడింది. అయితే రిషభ్ పంత్ అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది. మరో కోణంలో చేతిలో పడినట్లు ఉంది. దాంతో పలుకోణాల్లో పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని డస్సెన్ను ఔటిచ్చాడు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ ప్రకటించారు.

సఫారీ కెప్టెన్ అసంతృప్తి..
ఇక ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. డసెన్ అవుటైన తీరుపై తమ జట్టు మేనేజర్ ఖొమొత్సొ మసుబెలెలెతో కలిసి అంపైర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. టీవీ రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడటానికి ముందు బంతి నేలను తాకినట్లు కనిపించింది. సైడ్ యాంగిల్లో మాత్రం క్యాచ్ పట్టినట్లు కనబడింది. ఇదే విషయాన్ని అంపైర్లకు చెప్పిన డీన్ ఎల్గర్.. తమకు అన్యాయం జరిగిందని వారి ముందు వాపోయినట్లు సమాచారం.

రిషభ్ పంత్ ఒక్కడికే తెలుసు..
ఈ వికెట్ గురించి కామెంటేటర్ మార్క్ నికోలస్ మాట్లాడుతూ... ''ఒక యాంగిల్లో ఒకలా.. మరో యాంగిల్లో ఇంకోలా కనిపిస్తుంది. కాబట్టి ఔట్ కాలేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఇందుకు కచ్చితమైన ఆధారాలు ఉంటే... ఫీల్డింగ్ కెప్టెన్కు సదరు బ్యాటర్ను వెనక్కి పిలిపించమని సూచించేవారు'' అని పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్.. ఇలాంటి అస్పష్టమైన దృశ్యాల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమని, బంతి నేలను తాకిందా లేదా అనేది పంత్ ఒక్కడికే తెలిసి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఆధిక్యంలో సౌతాఫ్రికా..
శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగినా.. ఇతర పేసర్లు విఫలమవడంతో సౌతాఫ్రికా ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. 75 ఓవర్ల ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్రీజులో టెయిలండర్స్ కేశవ్ మహరాజ్(21 బ్యాటింగ్), మార్కో జాన్సెన్(9 బ్యాటింగ్) ఉన్నారు. జాన్సెన్ అడ్డుగోడలా నిలబడే ప్రయత్నం చేస్తుండగా.. మహరాజ్ పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 10 పరుగుల లీడ్లో ఉంది. 35/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికాను పీటర్సన్(62), టెంబా బవుమా(51) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.


Click it and Unblock the Notifications












