టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ అరుదైన ఘనతను అందుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరుగుతున్న అనాధికారిక టెస్ట్లో ప్రసిధ్ కృష్ణ ఈ ఫీట్ సాధించాడు. మొత్తం ఐదు వికెట్లతో సౌతాఫ్రికా ఏ జట్టు పతనాన్ని శాసించాడు.
ఆరంభంలో దారుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్ణ అనంతరం చెలరేగాడు. హ్యాట్రిక్తో పాటు చివరి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిధ్ కృష్ణతో పాటు సౌరభ్ కుమార్(2/83) మూడు వికెట్లతో రాణించడంతో సౌతాఫ్రికా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్, విధ్వత్ కావేరప్ప తలో వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జీన్ డుప్లెసిస్ సెంచరీతో కదంతొక్కగా.. రూబిన్ హెర్మన్(95) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్-ఏ 45 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(14), దేవదత్ పడిక్కల్(30) విఫలమైనా.. ప్రదోష్ రంజన్ పాల్(79 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్(68) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.
ప్రస్తుతం క్రీజులో రంజన్ పాల్తో పాటు కేఎస్ భరత్ ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలోనే ఉన్న టీమిండియా ఆతిథ్య సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ల సిరీస్లు ఆడనుంది. గురువారం జరిగే చివరి టీ20తో మూడు టీ20ల సిరీస్ ముగియనుంది. ఇక భారత్-ఏ జట్టు.. సౌతాఫ్రికా ఏ టీమ్తో మూడు అనాధికారిక టెస్ట్లు ఆడనుంది.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ టెస్ట్ల్లో ఆడుతున్న ప్రసిధ్ కృష్ణ.. టీమిండియా టెస్ట్ టీమ్లో కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రధాన సిరీస్కు ముందు ఈ అనాధికారిక టెస్ట్లు అతనికి ప్రాక్టీస్గా ఉపయోగపడనున్నాయి. డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. జవనరి 3 నుంచి 7 వరకు కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.