సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం ఓటమి నుంచి గట్టెక్కింది. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పూజావస్త్రాకర్ సంచలన బౌలింగ్తో 4 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగులు చేసింది. స్మృతి మంధాన(120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్లతో 136), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 103 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. రిచా ఘోష్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

సౌతాఫ్రికా బౌలర్లలో ఎమ్లాబా రెండు వికెట్లు తీయగా.. క్లాస్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్(135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 135 నాటౌట్), మరిజన్నే కాప్(94 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 114) సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్(2/54), దీప్తి శర్మ(2/56) రెండేసి వికెట్లు తీయగా.. తెలుగు తేజం అరుంధతి రెడ్డి(1/62), స్మృతి మంధానా(1/13) తలో వికెట్ తీసారు. ముఖ్యంగా చివరి ఓవర్లో పూజా వస్త్రాకర్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చింది. 11 పరుగులను డిఫెండ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టింది.

భారీ లక్ష్యచేధనలో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమవ్వగా.. పూజా వస్త్రాకర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇచ్చింది. తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతికి బౌండరీ వచ్చింది. దాంతో సఫారీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వరుసగా రెండు వికెట్లు తీసిన పూజా వస్త్రాకర్ మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పింది. చివరి 2 బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.