టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. డేంజరస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(22)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడం ద్వారా టీ20ల్లో 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటికే టెస్ట్ల్లో 234 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. వన్డేల్లో 149 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా.. ఓవరాల్గా ఐదో ప్లేయర్గా రికార్డుకెక్కాడు. లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టీమ్ సౌథీ, షాహిన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అంతేకాకుండా భారత్ తరఫున 100 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. అర్ష్దీప్ సింగ్(105 వికెట్లు) బుమ్రా కంటే ముందున్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఊచకోతతో పోరాడే లక్ష్యాన్ని అందుకున్న భారత్.. ఆ తర్వాత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డెవాల్డ్ బ్రెవిస్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/14), జస్ప్రీత్ బుమ్రా(2/17), వరుణ్ చక్రవర్తీ(2/19), అక్షర్ పటేల్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.