సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 358 పరుగుల భారీ స్కోర్ చేసిన తర్వాత కూడా ఓడిపోవడం ఏంటని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమై శతకాలతో చెలరేగినా.. తొలి వన్డే కంటే 9 పరుగులు అదనంగా చేసినా విజయం దక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డ్యూ ఫ్యాక్టర్తో పాటు లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్, టాస్ ఓడిపోవడం తమ ఓటమికి ప్రధాన కారణాలని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ తెలిపాడు. దాంతో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివర్లో ఈ ఇద్దరూ దూకుడుగా ఆడి పరుగులు చేయకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
జడేజా, సుందర్ దూకుడుగా ఆడి ఉంటే భారత్ 380 400 పరుగుల లక్ష్యం నమోదు చేసేదని, అప్పుడు భారత విజయవకాశాలు మెరుగయ్యేవని అభిప్రాయపడుతున్నారు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడం టీమిండియాకు నష్టం చేసిందని కామెంట్ చేస్తున్నారు. 39 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్లకు 284 పరుగులతో బలమైన స్థితిలో నిలిచింది. భారత బ్యాటింగ్ జోరును చూసి ఈజీగా 400 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివరి 11 ఓవర్లలో భారత్ కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది.

ఫినిషర్ పాత్ర పోషించాల్సిన జడేజా 27 బంతుల్లో 24 పరుగులే చేశాడు. వాషింగ్టన్ సుందర్ 8 బంతుల్లో 1 పరుగే చేసి వెనుదిరిగాడు. రాహుల్ ఒక్కడే 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. జడేజా కూడా అతనికి సహకారం అందించి ఉంటే భారత్ 20 30 పరుగులు అదనంగా చేసి ఉండేది. ఈ విషయాలనే ప్రస్తావిస్తూ జడేజా, సుందర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జడేజా, సుందర్ల పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా.. లోయార్డర్ వైఫల్యం ఓటమికి కారణమైందన్నాడు. లోయరార్డర్లో ఆడింది జడేజా, సుందర్లు మాత్రమే. 'ఈ మ్యాచ్లో విపరీతమైన మంచు ఉంది. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. మా బాధను చూడలేక అంపైర్లు బంతిని మార్చారు. టాస్ కీలక పాత్ర పోషించింది.
టాస్ ఓడినందుకు ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి. అయితే ఈ మ్యాచ్లో మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. 350 పరుగులు మంచి స్కోర్. కానీ డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో మరో 20-25 పరుగులు అదనంగా చేయాల్సింది. ఫీల్డింగ్లో కూడా తప్పిదాలు చేశాం. కొన్ని పరుగులును ఆపలేకపోయాం. కోహ్లీ, రుతురాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మంచి టెంపో అందించారు. రుతురాజ్ తన దూకుడైన బ్యాటింగ్తో 20 పరుగులు అదనంగా అందించాడు. లోయరార్డర్ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది.'అని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.