IND vs SA: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. సౌతాఫ్రికాతో నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోసారి భీకరమైన బ్యాటింగ్తో భారత బ్యాటర్లు చెలరేగగా.. బౌలర్లు అద్వితీయమైన బౌలింగ్తో విజయాన్నందించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. తిలక్ వర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) తన జోరు కొనసాగించగా.. అక్షర్ పటేల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు.

ధాటిగా ఆడే క్రమంలో రింకూ సింగ్(13బంతుల్లో ఫోర్, సిక్స్తో 16), ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) చెలరేగాడు. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్, కార్బినో బోష్, అన్రిచ్ నోర్జ్, మఫకా తలో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఎయిడెన్ మార్క్రమ్(19 బందుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38), ర్యాన్ రికెల్టన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), జాసన్ స్మిత్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), ట్రిస్టన్ స్టబ్స్(21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 45 నాటౌట్), మార్కో జాన్సెన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) రాణించారు.
భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా టీమిండియా ప్రాక్టీస్ అదిరింది. భారత్ ధాటికి మరోసారి సౌతాఫ్రికా వణికింది.