మూడు వన్డేల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై సఫారీ బౌలర్లు చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు కుప్పకూలింది. సాయి సుదర్శన్(83 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 63), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నాండ్రె బర్గర్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. బ్యూరన్ హెండ్రీక్స్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీసారు. లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బర్గర్ వేసిన తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్(4) వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో సాయి సుదర్శన్ ఆచితూచి ఆడాడు. పిచ్ బౌలర్లకు అడ్వాంటేజ్గా ఉండటంతో భారత బ్యాటర్లు ఓపికగా బ్యాటింగ్ చేశారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 45 పరుగులే చేసింది.
ఆ వెంటనే తిలక్ వర్మ(10)ను బర్గర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విలియమ్స్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగుతున్న సాయి సుదర్శన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు దిగిన సంజూ శాంసన్(12)ను హెన్రీక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి రింకూ సింగ్ రాగా.. కేఎల్ రాహుల్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రాహుల్ ఔటవ్వగా.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన రింకూ సింగ్ను కేశవ్ మహరాజ్ స్టంపౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(7), కుల్దీప్ యాదవ్(1) దారుణంగా విఫలమయ్యారు. అర్ష్దీప్ సింగ్(18), ఆవేశ్ ఖాన్(9) కాసేపు ఆడే ప్రయత్నం చేసారు. కానీ సౌతాఫ్రికా బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. దాంతో భారత్ 211 పరుగులకు కుప్పకూలింది.