
కేప్టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. 13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీసేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(31 బంతుల్లో 2 ఫోర్లతో 9) ఉన్నారు.
ఓపెనర్లు కేఎల్ రాహుల్(10), మయాంక్ అగర్వాల్(7) మరోసారి నిరాశపరిచారు. రబడా బౌలింగ్లో మయాంక్ ఔటవ్వగా.. రాహుల్ను జాన్సెన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం భారత్ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు 230-250 పరుగులు చేసి సౌతాఫ్రికా ముందు 300-320 రన్స్ లక్ష్యాన్ని ఉంచితే టీమిండియా విజయం సులువవుతుంది. సఫారీ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్లో 270 ప్లస్ రన్స్ చేజ్ చేయడం కష్టం. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే సఫారీ టీమ్పై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు భారత పేస్ పదునుతో ఆ జట్టును దెబ్బకొట్టవచ్చు.
ఇక 17/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ జట్టులో కీగన్ పీటర్సన్(166 బంతుల్లో 9 ఫోర్లతో 72) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మరే బ్యాట్స్మన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(5/42) అదరగొట్టాడు. నాలుగేళ్ల క్రితం ఇదే వేదికగా సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తాచాటిన బుమ్రా.. మళ్లీ తన మార్క్ పెర్ఫామెన్స్ను కనబర్చాడు. అతనికి తోడుగా ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్కు 3 వికెట్లు దక్కాయి.