సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. పేస్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బౌలర్లు చెలరేగడంతో బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
భారత బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39) రెండెంకల స్కోర్ చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(8) మినహా మిగతా బ్యాటర్లంతా ఖాతా తెరవలేకపోయారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.

153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. తర్వాత 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఇలా ఒకే స్కోర్ వద్ద 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. చివరి ఆరుగురు బ్యాటర్ల స్కోర్లు 0, 8, 0,0, 0, 0, 0గా ఉండటం విశేషం. కేఎల్ రాహుల్(8) తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(0), జస్ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0)లు ఖాతా తెరవలేకపోయారు.
అంతకుముందు సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లు పడగొట్టారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్హమ్(12), కైల్ వెర్రెయన్(15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఈ మ్యాచ్లో 59.3 ఓవర్లలోనే 20 వికెట్లు పడ్డాయి. రెండో సెషన్లలో రెండు జట్లు ఆలౌటయ్యాయి. ఇక టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 98 పరుగుల ఆధిక్యం లభించింది.