టెస్ట్ క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. సౌతాఫ్రికాతో గురువారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో సఫారీ గడ్డపై అత్యంత భారీ పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఈ ఘోర పరాజయం ఎదురైంది.
గతంలో 2010 డిసెంబర్లో ఇన్నింగ్స్ 25 రన్స్ తేడాతో ఓడిన చెత్త రికార్డ్ను తాజాగా టీమిండియా అధిగమించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్ టీమిండియా ఓటమిని శాసించాయి.

163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ, శుభ్మన్ గిల్(26) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి. 256/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) భారీ శతకానికి తోడుగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.