
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. 16/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 130 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆథిత్య జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంకా రోజున్నర ఆట మిగిలుండగా.. సౌతాఫ్రికాను ఆలౌట్ చేస్తే భారత్కు విజయం దక్కుతుంది. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సౌతాఫ్రికా ఈ రోజు మిగిలిపోయిన ఆటతో పాటు రేపు ఆడాల్సి ఉంటుంది. అయితే రేపు వర్షం వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీసేందుకు భారత్ ప్రయత్నించనుంది.
ఇక భారత ఇన్నింగ్స్లో రిషభ్ పంత్(34 బంతుల్లో 6 ఫోర్లతో 34), అజింక్యా రహానే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 4 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడే క్రమంలో భారత బ్యాట్స్మన్ వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/42), మార్కో జాన్సెన్(4/55) నాలుగేసి వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.
305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా అప్పుడే తొలి వికెట్ కోల్పోయింది. మహమ్మద్ షమీ సూపర్ బాల్కు సఫారీ ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే షమీ సూపర్ బాల్కు బిత్తరపోయాడు.
ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 327 పరుగులకు ఆలౌటవ్వగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. శార్దూల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్కు ఓ వికెట్ దక్కింది. దాంతో భారత్కు భారీ ఆధిక్యం లభించింది. తొలి రోజు బ్యాటుతో అదరగొట్టిన టీమిండియా మంగళవారం బ్యాటుతో తేలిపోయింది. ఎంగిడి ధాటికి 55 పరుగులకే మిగతా 7 ఏడు వికెట్లు కోల్పోయి 327తో సరిపెట్టుకుంది. కానీ తగ్గేదేలే అంటూ షమీ నిప్పులు చెరగడంతో విలువైన ఆధిక్యం సంపాదించి, మ్యాచ్పై పట్టుబిగించింది.