
భారత్ 174 ఆలౌట్..
అంతకుముందు 16/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 130 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆథిత్య జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారత ఇన్నింగ్స్లో రిషభ్ పంత్(34 బంతుల్లో 6 ఫోర్లతో 34), అజింక్యా రహానే(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 4 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడే క్రమంలో భారత బ్యాట్స్మన్ వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/42), మార్కో జాన్సెన్(4/55) నాలుగేసి వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.

చెలరేగిన బుమ్రా..
లంచ్ బ్రేక్ వరకు నిదానంగా ఆడిన భారత్.. ఆ తర్వాత ధాటిగా ఆడాలనే క్రమంలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. చివర్లో రిషభ్ పంత్ ధాటిగా ఆడటంతో భారత్ 300 ప్లస్ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(1)ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయగా.. కీగన్ పీటర్సన్(17)ను సిరాజ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డస్సెన్తో కెప్టెన్ డీన్ ఎల్గర్.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నైట్ వైచ్మన్గా కేశవ్ మహరాజ్( 8)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో నాలుగో రోజు ఆట ముగిసింది.

షమీ సూపర్బ్ బౌలింగ్..
ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 327 పరుగులకు ఆలౌటవ్వగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. శార్దూల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్కు ఓ వికెట్ దక్కింది. దాంతో భారత్కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి రోజు బ్యాటుతో అదరగొట్టిన టీమ్ ఇండియా మంగళవారం బ్యాటుతో తేలిపోయింది.ఎంగిడి ధాటికి 55 పరుగులకే మిగతా 7 ఏడు వికెట్లు కోల్పోయి 327తో సరిపెట్టుకుంది. కానీ తగ్గేదేలే అంటూ షమి నిప్పులు చెరగడంతో విలువైన ఆధిక్యం సంపాదించి, మ్యాచ్పై పట్టుబిగించింది


Click it and Unblock the Notifications
