టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన శుభ సందర్భమో ఏమో కానీ భారత మహిళా క్రికెటర్లు సైతం అద్భుత విజయం సాధించారు. భారత పురుషుల టీమ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించి రెండోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడిది. అదే సౌతాఫ్రికాతోనే జరిగిన ఏకైక టెస్ట్లో భారత మహిళలు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. రెండు రోజుల వ్యవధిలో భారత అభిమానులకు డబుల్ ధమాకా దక్కగా.. సఫారీలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.
చెన్నై వేదికగా సోమవారం ముగిసిన ఏకైక టెస్ట్లో 37 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల టీమ్.. తొలి ఇన్నింగ్స్లో 603/6 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లెర్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్లతో 205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(161 బంతుల్లో 27 ఫోర్లు, సిక్స్తో 149) శతక్కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్(69), జెమీమా రోడ్రిగ్స్(55), రిచా ఘోష్(86) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా(8/77) సఫారీ పతనాన్ని శాసించింది. దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
337 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ లౌరా వాల్వార్డ్(122), సునె లుస్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రాజశ్వేరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్, షెఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ తలో వికెట్ తీసారు.