సౌతాఫ్రికా గడ్డపై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్లో ఓవర్ రేట్కు కారణమైంది.
నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించాడు. దాంతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం నుంచి ఆరోస్థానానికి పడిపోయింది.

భారత్పై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సౌతాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ రూల్స్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లను పూర్తి చేయకపోతే.. జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో ఓవర్కు చొప్పున 5 శాతం కోత విధిస్తారు. భారత్ రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో 10 శాతం కోత విధించారు.
ఆర్టికల్ 16.11.2లోని డబ్ల్యూటీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం ఓవర్ చొప్పున ఒక పాయింట్ను కోత విధిస్తారు. స్లో ఓవర్ రేట్ అభియోగాలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ తదుపరి విచారణ లేకుండా చర్యలు తీసుకున్నాడు.
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో పాటు రెండు పాయింట్స్ కోత విధించడంతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్లో టీమిండియా 38.89 విజయాల శాతంతో అగ్రస్థానం నుంచి ఆరోస్థానానికి పడిపోయింది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా ఇప్పటి వరకు మూడు టెస్ట్లు ఆడి ఒకమ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడింది. ఇంకో మ్యాచ్ను డ్రా చేసుకుంది.
జులైలో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్ట్ల సిరీస్తో టీమిండియా డబ్ల్యూటీసీ 2023-25 టోర్నీని షురూ చేసింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన పాకిస్థాన్ సైతం రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు విజయాల శాతం 45.83గా ఉంది.
ర్యాంక్ టీమ్ పీసీటీ
| ర్యాంక్ | టీమ్ | పీసీటీ |
| 1 | సౌతాఫ్రికా | 100 |
| 2 | న్యూజిలాండ్ | 50 |
| 3 | ఆస్ట్రేలియా | 50 |
| 4 | బంగ్లాదేశ్ | 50 |
| 5 | పాకిస్థాన్ | 45.83 |
| 6 | భారత్ | 38.89 |
| 7 | వెస్టిండీస్ | 16.67 |
| 8 | ఇంగ్లండ్ | 15 |
| 9 | శ్రీలంక | 0 |