టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆఖరి బంతి వేసిన వెంటనే కుప్పకూలిన హార్దిక్ పాండ్యా.. కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. ఈ క్రమంలో అతను ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయాడు.
విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు గట్టిగా అరుస్తూ విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత ఆటగాళ్ల భావోద్వేగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆఖరి ఓవర్ వరకు విజయం ఇరు జట్లను ఊరించింది.
ఓ దశలో సౌతాఫ్రికా సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ సంచలన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయగా.. బుమ్రా మార్కో జాన్సెన్ను ఔట్ చేయడంతో పాటు పరుగులివ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేశాడు.
అర్ష్దీప్ సింగ్ సైతం అదే జోరును కొనసాగించడంతో భారత విజయం లాంఛనమైంది. ఆఖరి ఓవర్లో సూర్య పట్టిన క్యాచ్ కూడా మ్యాచ్ను భారత్వైపు తిప్పింది. దాంతోనే భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.
34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ.. అక్షర్ పటేల్తో కలిసి ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు 72 పరుగులు జోడించి భారీ స్కోర్ అందించాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.