రోహిత్, రాహుల్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43), కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57)శుభారంభం అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ప్రతీ ఓవర్లో పోటాపోటీగా ఈ ఇద్దరూ బౌండరీలు బాదడంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. దాంతో టీ20ల్లో అత్యధిక సార్లు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా రోహిత్-రాహుల్ రికార్డుకెక్కారు. పవర్ ప్లే అనంతరం కూడా ఈ జోడీ ధాటిగా ఆడింది.
దెబ్బ కొట్టిన కేశవ్..
96 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విడదీసాడు. హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో రాహుల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మహరాజ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చిరావడంతోనే బౌండరీ బాదాడు. తనదైన 360 డిగ్రీల ఆటతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
చెలరేగిన సూరీడు..
మరోవైపు విరాట్ కోహ్లీ సైతం.. చెలరేగడంతో భారత స్కోర్ బోర్డు వేగంగా పరుగెత్తింది. పార్నెల్ వేసిన 17వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన సూర్య.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఎంగిడి బౌలింగ్లో మరో సిక్సర్ బాదిన సూర్య.. 19వ ఓవర్లో అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్.. ఓ బౌండరీతో పాటు రెండు సిక్స్లు కొట్టడంతో టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్ చేసింది.


Click it and Unblock the Notifications
