సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా బ్యాటర్లు తడబడిన పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నారు.
డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) తృటిలో శతకం చేజార్చుకోగా.. టెయిలెండర్ మార్కో జాన్సెస్(72 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలింగ్ విభాగంపై దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. వారికి అండగా ఇతర బౌలర్లు రాణించడం లేదన్నాడు.

దాంతో మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని చెప్పాడు. మహమ్మద్ షమీ ఉంటే సౌతాఫ్రికా ఎప్పుడో ఆలౌటయ్యేదని అభిప్రాయపడ్డాడు. 'మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. అతను ఓ బౌలర్గా కాకుండా లీడర్గా ఎదిగాడు. జస్ప్రీత్ బుమ్రాకు అతను సరైన జోడీ.
ఈ రకమైన పిచ్పై సీమ్తో రెండు వైపులా మహమ్మద్ షమీ బౌలింగ్ చేసుంటే.. సఫారీ బ్యాటర్లకు చుక్కలు కనబడేవి. కచ్చితంగా అతను వికెట్లు పడగొట్టేవాడు. టీమిండియా నిజంగా అతన్ని మిస్సవుతోంది. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ ఈ మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 27 ఓవర్లలోనే 118 పరుగులు సమర్పించుకున్నారు.
మరోవైపు బుమ్రా, సిరాజ్ 31 ఓవర్లలో 111 రన్సే ఇచ్చాడు. చివర్లో సిరాజ్ కాస్త పరుగులు ఇచ్చాడు. అయినా బుమ్రాతో పోటీగా బంతులు వేసాడు. ఈ ఇద్దరు బౌలింగ్ చేసిన ప్రతీసారి వికెట్ తీసేలా కనిపించారు. కానీ శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. బ్యాటర్ తప్పిదం కోసం వేచి చూడాల్సి వచ్చింది.'అని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 100 ఓవర్లలో 7 వికెట్లకు 392 పరుగులు చేసింది. క్రీజులో మార్కో జాన్సెన్(120 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 72 బ్యాటింగ్)తో పాటు కగిసో రబడా(1 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.