IND vs SA: సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షమీ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నొప్పిని తగ్గించుకునేందుకు ముంబైలోని ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ వైద్యుడిని కలిసిన అతను.. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
అయితే ఈ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని షమీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే మహమ్మద్ షమీ గైర్హాజరీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక రెండు టెస్ట్ల సిరీస్ కోసం ఎంపికైన భారత ఆటగాళ్లు శుక్రవారం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవ్దీప్ సైనీ, హర్షిత్ రాణా సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నారు. మిగతా ఆటగాళ్లు మరో విడతలో అక్కడికి చేరుకోనున్నారు. ఈ సిరీస్కు మహమ్మద్ షమీ దూరమైతే అతని స్థానంలో మరో పేసర్కు అవకాశం ఇవ్వనున్నారు.
డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. జవనరి 3 నుంచి 7 వరకు కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. డబ్ల్యూటీసీ 2023-25 టోర్నీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ సారైనా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది.
ఇప్పటికే సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న యంగ్ ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతోంది. నేటితో టీ20 సిరీస్ ముగియనుండగా.. ఆదివారం మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.