సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్లో విజయవకాశాలు సృష్టించుకున్న భారత్.. చివర్లో తడబడి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.
టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రనౌటవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే టాప్-3 బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌటవ్వగా.. అభిషేక్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(4) తీవ్రంగా నిరాశపరిచారు.

ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ డేవిడ్ మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్కు తిలక్ వర్మ(20 బంతుల్లో 20) వెనుదిరగ్గా.. హార్దిక్ పాండ్యాతో కలిసి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన అక్షర్ పటేల్.. నాలుగు ఫోర్లతో 21 బంతుల్లో 27 పరుగులతో జోరు కనబర్చాడు.
క్రీజులో సెట్ అయ్యాడని అంతా అనుకున్న తరుణంలో అక్షర్ పటేల్ను దురుదృష్టం వెంటాడింది. విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా ఆడిన స్ట్రైట్ షాట్కు నాన్ స్ట్రైకర్గా ఉన్న అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. బంతి బౌలర్ను తాకి వికెట్లను తాకడం.. అక్షర్ క్రీజు బయట ఉండటంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ రనౌట్ మ్యాచ్ను మలుపు తిప్పింది.
ఇదే భారత ఓటమికి ప్రధాన కారణమైంది. ఒకవేళ అక్షర్ పటేల్ ఆఖరి వరకు బ్యాటింగ్ కొనసాగించి ఉంటే భారత్ మరిన్ని పరుగులు చేసేంది. 140-150 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చివర్లో హార్దిక్ పాండ్యా అతివిశ్వాసంతో బంతులను వృథా చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగులే చేసింది.
అనంతరం సౌతాఫ్రికాను స్పిన్నర్లు కట్టడి చేసినా పేసర్లు చేతులెత్తయడంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం జరగనుంది.